పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు.జల వనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్-1, గ్యాప్-2లు పూడ్చే పనుల అంశంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2లు రెండిరటినీ పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని వారు వెల్లడిరచారు.
పోలవరంపై జగన్ ఆదేశాలు
పోలవరంలో వరదలు తగ్గగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందని సీఎం తెలిపారు.
పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంపొనెంట్ వైజ్గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్గా డబ్బులు తెప్పించుకుంటే..ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చన్నారు.
వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్నారు. ఈమేరకు అడహాక్గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. ఈమేరకు కేంద్రానికి లేఖలు కూడా రాయాలని ఆదేశించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారు.
ప్రాధాన్యతా ప్రాజెక్టులపై జగన్
ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామని అధికారులు ఇవాళ సీఎం జగన్ కు తెలిపారు. దసరా నాటికి అవుకు టన్నెల్-2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ – 2పనులపైనా సీఎం సమీక్ష జరిపారు. ఏప్రిల్లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామని అధికారులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
నెలవారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వంశధార ప్రాజెక్టు స్టేజ్-2,ఫేజ్-2పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు తెలిపారు. అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలంకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం రాష్ట్రంలో 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి సీఎం లక్ష్యాలను నిర్దేశించారు.