ఏపీ సచివాలయంలో ఉద్యోగులు పనివేళల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పని వేళల్లో ఉద్యోగులు తమ సెక్షన్లలోనే ఉండాలని ఆదేశించింది. దీనిపై సీఎస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని కూడా తెలిపింది. అన్నట్లుగానే ఇవాళ సీఎస్ తనిఖీలకు దిగారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇవాళ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సాధారణ పరిపాలన శాఖ గతంలో ఇచ్చిన సర్కులర్ ప్రకారం ఆయన ఇవాళ ఈ తనిఖీలు నిర్వహించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ విధుల్లో ఉన్నారా లేదా అనేది సీఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. సచివాలయంలోని వివిధ బ్లాక్ లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న అధికారులతో వివరాలు తీసుకున్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సచివాలయంలోని మూడవ బ్లాకు వద్ద ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు, సమయానికి వస్తున్నారా లేదా అని సీఎస్ జవహర్ రెడ్డి ఆరా తీశారు. మహిళాశిశుసంక్షేమ, మైనార్టీ వెల్ఫేర్, పర్యటక శాఖల్లో ఉద్యోగుల పని సమయాన్ని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఎంత అటెండెన్స్ వుంది ఎంతమంది వచ్చారు అనే వివరాలు కూడా సీఎస్ సేకరించారు. ఉద్యోగుల సీట్ల వద్దకు వెళ్లి మరీ సీఎస్ తనిఖీలు నిర్వహించారు. ఇవాళ సచివాలయానికి వస్తూనే ఆయన మూడవ బ్లాక్ కు వెళ్లి ఈ తనిఖీలు చేపట్టడంతో ఉద్యోగులు ఈ తనిఖీలపై చర్చించుకుంటున్నారు.