తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి తేజ వీర మరణం పొందాడు. సాయి తేజ ఆకస్మిక మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిజేస్తున్నారు. సాయితేజ కుటుంబానికి అండగా నిలబడతామని అంటున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయితేజ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.సాయి తేజ భార్య శ్యామల, తమ్ముడు మహేష్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. తాము సాయి తేజ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సాయి తేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా అందజేస్తామని లేఖలో తెలిపారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సూచించారు. కేవలం తొమ్మిదేళ్లలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సెక్యూరిటీగా సేవలందించే ఉన్నత స్థాయికి చేరుకున్న సాయితేజ సేవలను కొనియాడారు.