Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం సానుకూలంగా స్పందించారు : చిరంజీవి

సినిమా టికెట్‌ ధరల విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన చర్చ సంతృప్తినిచ్చిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో సీఎంతో చిరంజీవి భేటీ అయ్యారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు. జగన్‌తో సమావేశం గురించి వివరించారు.జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృఫ్తికరంగా జరిగిందని తెలిపారు. జగన్‌ తనకు సోదర సమానుడని, సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ‘‘అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.’ అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో నాకు ఎనలేని ధైర్యం వచ్చింది.’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం వేసిన కమిటీతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జగన్‌ చెప్పినట్లు చిరంజీవి తెలియజేశారు. జీవో 35 గురించి పునరాలోచిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. తాను ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెప్పారు. ఇండస్ట్రీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img