విజయవాడ తూర్పులో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఎంవీఆర్ చౌదరి టీడీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో సోమవారం ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఎంవీఆర్ చౌదరి తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోకేశ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, చౌదరి గతంలో పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా కొంతకాలం పనిచేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంవీఆర్ చౌదరికి సమూచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని చౌదరి అన్నారు.