ఏపీలో పదో తరగతి పరీక్షల్లో భాగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.గురువారం తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ పదో తరగతి ప్రశ్నపత్రాల లీజేపీపై స్పందించారు.పదో తరగతి ప్రశ్నాపత్రాలను నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచి లీక్ చేయించారని జగన్ వ్యాఖ్యానించారు. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి, మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వీళ్లే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్లను బయటకు పంపి భయాందోళనలకు గురి చేయాలని చూశారని విమర్శించారు. పేపర్ లీకులపై కొందరు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా? అని ప్రశ్నించారు.