ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఏపీ అధికారుల బృందాన్ని ఆ దేశ సరిహద్దులకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఏపీ ప్రతినిధులను పంపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా దేశాలకు వెళ్లనున్న ఏపీ ప్రతినిధులు రాష్ట్ర విద్యార్థుల తరలింపును సమన్వయం చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన 680 మంది విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది. భారత్ లోని ఉక్రెయిన్ దౌత్య కార్యాలయం నుంచి ఈ వివరాలు సేకరించారు.