గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించేందుకు సంబంధించిన ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. అలాగే ఇప్పటి వరకూ గృహనిర్మాణ లబ్దిదారులకు ఇస్తోన్న 90 బస్తాల సిమెంట్ ను 140 బస్తాలకు పెంచిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గృహనిర్మాణ శాఖమంత్రిగా చేసి రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టించే బృహత్తరమైన బాధ్యతను అప్పగించారన్నారు. ‘31 లక్షల మందికి ఇళ్లు కట్టే శాఖకి సీఎం జగన్ నన్ను మంత్రిగా చేశారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. విశాఖపట్నంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్పై తొలి సంతకం చేశాం. లక్ష మంది విశాఖ పేదలకు ఇళ్లు కట్టిస్తాం. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకి పేదలు కష్టాలు చెప్పారు. ఆ కష్టాలను చూసి ఈ రోజు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నాం.’ అని చెప్పారు.