మూడో భార్య రమ్యపై తీవ్ర ఆరోపణలు చేసిన నరేశ్
తన మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తికోసం తనను చంపే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఇదే విషయమై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. రోహిత్ శెట్టితో కలసి రమ్య తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు. ఆమెతో తాను నరకాన్ని అనుభవిస్తున్నానని… తనను చంపేస్తారనే భయంతో ఒంటరిగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్ ను రమ్య హ్యాక్ చేయించి… తన పర్సనల్ మెసేజ్ లను చూసేదని అన్నారు. తనకు రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు..2010 మార్చిలో రమ్యతో తనకు బెంగళూరులో పెళ్లి జరిగిందని నరేశ్ తెలిపారు. కట్నం తీసుకోకుండానే తాను పెళ్లి చేసుకున్నానని… తన తల్లి విజయ నిర్మల ఆమెకు రూ. 30 లక్షల విలువైన ఆభరణాలను చేయించిందని చెప్పారు. అయితే, పెళ్లైన కొన్ని నెలల నుంచే రమ్య తనను వేధించడాన్ని ప్రారంభించిందని అన్నారు. తనకు తెలియకుండానే కొందరు వ్యక్తుల నుంచి, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుందని, లక్షల రూపాయల అప్పులు చేసిందని చెప్పారు. ఆమె చేసిన అప్పుల్లో తాను రూ. 10 లక్షలను తీర్చేశానని తెలిపారు. తమకు 2012లో రణవీర్ అనే కుమారుడు పుట్టాడని వెల్లడిరచాడు. మరోవైపు, సినీ నటి పవిత్ర లోకేశ్ తో నరేశ్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.