గుంటూరు జిల్లా పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ బయల్దేరారు. ఈ క్రమంలో నారా లోకేష్ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే తాను పాదయాత్రలు, ఆందోళనలు, ధర్నాలు చేయడానికి వెళ్లడంలేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే వెళుతున్నానని, తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం సరికాదన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని.. అలాంటప్పుడు తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. కాగా లోకేష్ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.