ఏఐటీయుసీ నేత వెంకటసుబ్బయ్య డిమాండ్
కడప కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
విశాలాంధ్ర బ్యూరో `కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లిన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛఆంధ్ర, స్వచ్ఛభారత్ అంటూ ప్రచార ఆర్భాటాలు తప్ప అందులో పనిచేసే కార్మికుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించు కోవడం లేదని ఏఐటీయుసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య విమర్శించారు. స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. హనుమంతు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ (హరిత రాయబారుల)కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 680 ప్రకారం కనీస వేతనం 10వేలు అమలుచేసి పెండిరగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ లు స్వచ్ఛ భారత్ లోని కార్మికుల పై ఒత్తిడి తీసుకొచ్చి మానుకోవాలని తమ అనుకూల వారిని నియమించుకోవాలని ‘చెత్త’ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల మాదిరిగానే సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 18000 రూపాయలు ఇచ్చి సామాజిక భద్రత చట్టంలో భాగంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి పని భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉద్దే మద్ధిలేటి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పొరుగు సేవల యూనియన్ నాయకులు సుబ్బరాయుడు, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు అంజ నేయులు, జి ఆనందరావు, సుధాకర్, అశోక్ ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు, ఇమ్మనియేలు, చరణ్ తేజ, శంకర్, చిన్నన్న పవర్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.