Monday, May 20, 2024
Monday, May 20, 2024

బీజేపీ, వైసీపీని తరిమికొట్టాలి

పొన్నూరు రోడ్‌షోలో జల్లి విల్సన్‌ పిలుపు

విశాలాంధ్ర`పొన్నూరు: కేంద్రంలో మతోన్మాద బీజేపీ, రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు లోక్‌సభ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ పొన్నూరులో జల్ల్లి విల్సన్‌ ప్రచారం చేశారు. ఇండియా కూటమి పొన్నూరులో నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. మోదీ పాలనలో కార్మికులకు రక్షణ కరువైందన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇండియా కుటుంబ అభ్యర్థులైన గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌ను, పొన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి జక్కా రవీంద్రనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా రాజధాని లేదని, ప్రత్యేక హోదా సాధించలేకపోయామని, ఫలితంగా నిరుద్యోగంతో రాష్ట్రం కునారిల్లుతోందన్నారు. సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తమ బాధ్యత అని చెప్పిన కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జెల్ది భాగ్యశ్రీధర్‌ మాట్లాడుతూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై బీజేపీ మాటతప్పిందని, రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసగించిందన్నారు. సీపీఐ పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌ ఊసే ఎత్తడం లేదన్నారు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు మోదీ సర్కారు కుట్ర చేస్తోందన్నారు. రోడ్‌షోలో బాపట్ల జిల్లా సీపీఐ నాయకులు వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి రామారావు, కళాకారులు రాజేంద్ర, డి.శ్రీను, మహిళా సమాఖ్య నాయకులు కుమారి, సుగుణ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img