న్యూదిల్లీ : దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఓలా సంస్థ తొలిసారిగా తీసుకు రానున్న ఎలక్ట్రికల్ బైక్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లో హాట్ కేకులా లక్షకు పైగా రిజర్వేషన్ కావడం ఇందుకు నిదర్శనం. దీంతో సంస్థ రికార్డు సృష్టించింది. మీరు ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి రూ.499తో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నగదు కూడా రిఫండబుల్. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సంస్థ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురైంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం డిమాండ్ వెల్లువలా వస్తున్నదని తెలిపింది. మరికొన్ని రోజుల్లో స్కూటర్ లాంచ్ చేసే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడిరచింది. ఓలా గ్రూప్ చైర్మన్ భవేష్ అగర్వాల్ మాట్లాడుతూ తమ తొలి ఎలక్ట్రానిక్ స్కూటర్ కోసం దేశ వ్యాప్తంగా ఖాతాదారుల నుంచి ఇంత పెద్ద స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ అపూర్వమైన డిమాండ్ ఎలక్ట్రానిక్ వాహనాలపై వినియోగదారులను చూపిస్తున్న ఆసక్తికరమైన మార్పునకు సూచికగా తెలిపారు.