రాజ్కుంద్రా అరెస్టుపై మౌనం వీడిన శిల్పాశెట్టి
ముంబై : అశ్లీల చిత్రాల చిత్రీకరణ, పంపిణీ కేసులో రాజ్కుంద్రా అరెస్ట్ గురించి ఎట్టకేలకు అతడి భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెదవి విప్పారు. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు సృష్టిం చవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకి పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమే!! గత కొన్నిరోజు లుగా ప్రతి విషయంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్కుంద్రా అరెస్ట్ వ్యవహరంపై ఎన్నో పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై ఇప్పటివరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్నందున ఆ విషయంపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. ముంబై పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే, దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో ఇష్టం వచ్చినట్లు కథనాలు సృష్టిం చకండి. అంతేకాకుండా, ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా వ్యాఖ్యలు చేయకండి’ అని శిల్పాశెట్టి అన్నారు. అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రాను ఈ నెల 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.