హైదరాబాద్: టాలీవుడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. జనవరిలో హైదరాబాద్లో శర్వానంద్- రక్షితారెడ్డి (సాఫ్ట్వేర్ ఇంజినీర్) నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఇద్దరి కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చు కున్నారు. తాజాగా శర్వానంద్ రాయల్ వెడ్డింగ్ వివరాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం రాజస్థాన్ జైపూర్లోని లీలా ప్యాలెస్… వీరిద్దరి వివాహ వేడుకకు వేదిక కానుంది. ప్యాలెస్లో రెండు రోజుల పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. జూన్ 2న మెహిందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. జూన్ 3న వివాహ వేడుక జరుగనుండగా.. టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు వేడుకలో సందడి చేయబోతున్నారట. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని సమాచారం. రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు న్యాయవాది. శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ వివాహ పనులపై దృష్టి పెట్టాడట. వివాహం తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు వినికిడి. శర్వానంద్ 35గా వస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా… వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హేశమ్ అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గతేడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్.