హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సింగిల్స్ సినిమాపై అంచనాల్ని భారీ స్థాయిలో పెంచేశాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బహుభాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల్ని జోరుగా చేస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ను వచ్చే నెల్లో విడుదల చేయబోతున్నారు. ఇద్దరు సమవుజ్జీలైన హీరోల్ని నీరు, నిప్పు తీరులో తెరమీద ఆవిష్క రించనున్న రాజమౌళి.. ఈ సినిమాని దానికి తగ్గ స్థాయిలోనే విడుదలకు సిద్ధం చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా కోసం కనీవినీ ఎరుగని రీతిలో స్క్రీనింగ్ చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. దేశ వ్యాప్తంగా ఏకంగా 10వేల స్క్రీన్స్లో సినిమాను విడుదల చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు యూఎస్లో 2,500 స్క్రీన్స్లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అదే కానీ జరిగితే.. భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్గా ఆర్.ఆర్.ఆర్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.