హైదరాబాద్: పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తిచేయడం దృష్టి సారించాడు. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటుగా వినోదయ సిత్తం రీమేక్ను కూడా ప్రారంభించే పనిలో ఉన్నాడు. పి. సముద్రఖని దర్వకత్వం వహించ నున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టంట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను హరిహర వీరమల్లు కంటే ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లును ముందుగా ఏప్రిల్లో అనుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో దసరాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో వినోదయ సిత్తం రీమేక్ను పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి చివరివారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో పవన్కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు. పేరుకు తమిళ రీమేక్ అయినా.. త్రివిక్రమ్ తెలుగు నెటీవిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది.