Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం జోక్యం?

ప్రజాస్వామ్యంలో శాసన, పాలనా వ్యవస్థల తర్వాత న్యాయ వ్యవస్థ మూడో స్తంభం. రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వ్యవస్థల పట్ల నమ్మకం కలుగుతుంది. చాలాకాలంగా ప్రజల్లో నమ్మకం దిగజారిపోయి నప్పటికీ మరోమార్గంలేని ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అనేక కీలకమైన అంశాలపై న్యాయ వ్యవస్థ (కోర్టులు) ప్రభుత్వం ఆకాంక్షలు, ఉద్దేశాలు నెరవేర్చ గలిగేందుకు తోడ్పడే నిర్ణయాలు, తీర్పులు చెప్పిందన్న విమర్శలను ఎదుర్కొన్నది. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులు లక్షల్లో ఉన్నాయి. సత్వర పరిష్కారం కోసం పిటిషన్‌దారులు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన నేరాల కేసులలో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడంలో విఫలం చెందుతున్నారని పోలీసులను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్‌.వి. రమణ గట్టిగా మందలించారు. ఇదొక సానుకూల ప్రజానుకూలమైన పరిణామం. పోలీసుల పైన కచ్చితంగా కార్యనిర్వాహక వ్యవస్థలో భాగస్వాములైన మంత్రులు, ఇతర పలుకుబడి గలిగిన రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది. రాజకీయ వ్యవస్థ కీలకమైన దోషిగా నిలిచింది. లక్షల్లోకేసులు పెండిరగ్‌ఉండటానికి చాలావరకు ప్రభుత్వాలు మాత్రమే కారణం. దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఉన్న వేలాది ఖాళీలను ఏళ్ల కొలది భర్తీ చేయడం లేదు. ఇక పాలక పార్టీలపై ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు, ప్రజాబి óప్రాయాన్ని తమవైపు మళ్లించుకొనేందుకు వందలు, వేలల్లో కేసులు పెడుతున్నారు. దర్యాప్తు విభాగం సీబీఐ సైతం కోర్టు తీర్పులను కూడా గౌరవించకుండా ఏళ్ల తరబడి దర్యాప్తు చేయకుండా తాత్సారం చేస్తున్నదని, న్యాయస్థానాలకు సహకరించడం లేదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ దర్యాప్తు వ్యవస్థలను ప్రభుత్వాలు స్వతంత్రంగా పనిచేయడానికి అనుకూలించకపోతే పెద్దగా ప్రయోజనం ఉండటం కష్టం. నేరస్థులే పరిపాలనలో భాగస్వాములైనప్పుడు స్వతంత్రంగా ఏ వ్యవస్థ పని చేయడం సాధ్యం కాదని ఆయా వ్యవస్థల్లో పనిచేసే వారు చెప్పడం, తమ రచనల్లో వ్యక్తం చేయడం తెలిసిందే. ఖాళీలను భర్తీ చేయాలని చాలా కాలంగా సర్వోన్నత న్యాయస్థానం కోరుతున్నప్పటికీ పాలకులు స్పందించడం లేదు. ఇటీవల సుప్రీంకోర్టులో ఒకేసారి తొమ్మిదిమంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రప్రభుత్వం అదీ కొలీజియం సిఫారసు చేసిన తక్కువ గడువులోనే ఆమోదించడం ఆశ్చర్యం కలిగింది. అయితే కొలీజియం జాబితాలో బీజేపీ బాస్‌లను ఇబ్బంది పెట్టిన వారిపేర్లులేవు. ఇలా ఎందుకుజరిగింది? జాబితాలో ఈపేర్లు ఎందుకులేవన్న అంశంపైన విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తూ చర్చిస్తున్నారు. సీనియారిటి సైతం పాటించలేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాగే మెరిట్‌ని, వైవిధ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అఖిల్‌ ఖురేషి పేరులేదు. 2010లో ఇప్పటి హోంమంత్రి అమిత్‌షాని తమ కస్టడీకి అనుమతించాలని సీబీఐ కోరింది. అమిత్‌షా న్యాయవాది దీన్ని వ్యతిరేకిస్తూ తీవ్రంగా వాదించారు. అయినప్పటికీ ఖురేషి రెండురోజుల సీబీఐ కస్టడీకి అనుమతించారు. ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.మురళీధర్‌ పేరు కూడా జాబితాలో లేదు. దిల్లీలో అల్లర్లు మతఘర్షణలు జరగడానికి కారకులైన బీజేపీనాయకులను, విద్వేష ప్రసంగం చేసిన అమిత్‌షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దిల్లీ హైకోర్టు జడ్జిగా మురళీధర్‌ స్థానిక పోలీసులను ఆదేశించారు. చట్ట ప్రకారం తగిన సమయంలో చర్యలు తీసుకోవచ్చుకదా అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి న్యాయవాదులు వాదించగా ఆ సమయం ఏది? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
దిల్లీ కొన్ని ప్రాంతాలను అగ్నికీలలకు బలిచేసిన, ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు జరిగాయి. ఇది జరిగిన తర్వాత మురళీధర్‌ను మరో హైకోర్టుకు బదిలీచేశారు. జడ్జి హెచ్‌ఆర్‌ ఖన్నాకు ప్రధాన న్యాయమూర్తి పదవిని తిరస్కరించారు. ఎమర్జెన్సీ కాలంలో అయినా పౌరుల ప్రాథమిక హక్కులు చర్చించడానికి వీలులేదని జబల్‌పూర్‌ జిల్లా అదనపు మెజిస్ట్రేటు కేసులో (1976) ఖన్నా చెప్తూ తన అసమ్మతిని వ్యక్తం చేయడం వల్ల సీనియారిటీని, మెరిట్‌ని సైతం పరిగణించలేదు. 1973లో ఎన్‌ రాయ్‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేశారు. సీనియారిటీని పట్టించుకోలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ జెఎం షెలాత్‌, ఎఎస్‌ హెగ్డే, ఎఎస్‌ గ్రోవర్‌లు రాజీనామా చేశారు. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ వ్యవస్థ స్వరూపం మార్చడానికి వీలులేదని, పార్లమెంట్‌ సైతం దాన్ని మార్చలేదని జడ్జిలు తమ అభిప్రాయాన్ని వెల్లడిరచి రాజీనామా చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు. పాలనా వ్యవస్థ వీటిలో జోక్యం చేసుకోలేదని చెప్పగలమా?
ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫారసులపైన దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. భర్తీ చేయని పోస్టులలో ముగ్గురు మహిళలను సిఫారసు చేయడం, వారిలో ఒకరికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలుండటం ఎన్‌.వి.రమణ ఆచరణాత్మక ఆలోచనను ప్రతిబింబిస్తోంది. న్యాయమూర్తుల ఎంపిక లోనే కాదు, ఇతర రంగాలలోనూ సీనియారిటీనిఉల్లంఘించి పాలకులు తమకు అనుకూలంగా ఉన్న ఉన్నతస్థాయి అధికారులను, పోలీసు బాస్‌లను సైతం ఎంపిక చేయడం కనిపిస్తుంది. అసలు కొలీజియం ఏర్పాటుకే రాజ్యాంగం బాసటలేదని అదికేవలం ఆసక్తితో ఏర్పాటు చేసింది మాత్రమేనని జస్టీస్‌ కృష్ణయ్యర్‌ భావించారు. మూడేళ్ల తర్జన భర్జన తర్వాత న్యాయ మూర్తుల ఎంపిక వేగంగా జరగడం, ఒకేరోజు 9మంది న్యాయ మూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఆహ్వానించ దగిందే. వివిధ హైకోర్టులు 60శాతం న్యాయమూర్తులతో మాత్రమే పని చేస్తున్నాయి. ఇదికూడా పాలకుల అలక్ష్యానికి అద్దం పడుతుంది. హైకోర్టులలో 1080 పోస్టుల భర్తీకి మంజూరు ఇవ్వగా వీటిలో ఇంకా 400 పోస్టులను భర్తీ చేయవలసి ఉంది. దిగువ కోర్టుల్లో 24,247 జడ్జిల పోస్టుల భర్తీకి మంజూరు చేయగా వీటిలో మరో 4,928 పోస్టులు భర్తీ చేయలేదు. సెమీ న్యాయసంస్థలు, ట్రిబ్యునల్స్‌లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సమాచారం ఉంది. ఎంపిక కమిటీల సిఫారసుల మేరకు పోస్టులు భర్తీ చేయకుండా నెలలు గడుపుతున్నారని విమర్శలు తరచుగా వినిపిస్తున్నా ప్రభుత్వం దృష్టి ఇతర అంశాలపైనే ఉంటాయి. ప్రజల ఆకాంక్షల మేరకు న్యాయస్థానాలను పటిష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను స్వతంత్రంగా పని చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్న దానిపైనే ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుస్తుంది. కార్యనిర్వాహక వర్గం జోక్యం ఉందా లేదా? అన్న విషయం కూడా అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img