Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మరో ఆశాకిరణం బ్రెజిల్‌

లాటిన్‌ అమెరికాదేశాలు క్రమంగా వామపక్ష రాజకీయాల వేపు మొగ్గుతున్న దశలో విస్తీర్ణంలో, జనసంఖ్యలో ఆ ప్రాంతంలో పెద్దదైన బ్రెజిల్‌ లో లూలా మూడవ సారి అధ్యక్షుడు కావడం గాలి మార్పునకు స్పష్టమైన సంకేతం. అంతకు ముందు లూలా రెండు సార్లు 2002 నుంచి 2010 దాకా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బోల్స నారోను లూలా గద్దె దించగలిగారు. బ్రెజిల్‌లో అధికారంలోకి వచ్చిన వారు వరసగా రెండు సార్లు విజయం సాధించడం రివాజు. కాని బోల్సనారో రెండవ సారి విజయం సాధించలేకపోవడం విశేషం. 1980లో బ్రెజిల్‌ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ తరవాత రెండో సారి గెలవని నాయకుడు బోల్సనారో మాత్రమే. లూలా 50.9 శాతం ఓట్లు సంపాదిస్తే బోల్సనారో 49.1 శాతం ఓట్లు సంపాదించగలిగారు. లూలా విజయం ప్రజాస్వామ్య శక్తుల విజయానికి సంకేతం. బోల్సనారో నిరంకుశాధికారానికి లూలా విజయంతో అడ్డుకట్ట పడిరది. అయితే బోల్సనారో 2018లో సాధించిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు సంపాదించినా విజయం దక్కలేదు. కానీ లూలా 2018 కన్నా ఈ సారి మరిన్ని ఎక్కువ ఓట్లు సాధించారు. లూలాకు చాలా కాలంగా వ్యతిరేకి అయిన మాజీ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్‌ చర్డొసొ కూడా లూలావిజయం సాధించినందుకు అభినందించడమే కాక ప్రజాస్వామ్యం గెలిచింది అని వ్యాఖ్యానించారు. లూలా విజయం సైనిక నియంతృత్వానికి తెర దించింది. ఇది మానవాళి సాధించిన విజయం అని కూడా ప్రజాస్వామ్య వాదులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో లూలా ప్రజాస్వామ్యం, ఆచరణ వాదం అవసరాన్ని నొక్కి చెప్పారు. పౌర హక్కుల ఆవశ్యకత ఏమిటో తెలియజెప్పారు. గత నాలుగేళ్ల బోల్సనారో పాలనలో ప్రజలను నిర్లక్ష్యం చేశారు.
ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం ఛిన్నాభిన్నం అయిపోయాయి. సుస్థిరత కరువైంది. అందువల్లే బోల్సనారో మీద వ్యతిరేకత ప్రస్ఫుటంగా వ్యక్తం అయింది. లూలా గా ప్రసిద్ధుడైన లూయీ ఇనాసియో లూలా డ సిల్వా కార్మిక వర్గానికి చెందిన మొదటి అధ్యక్షుడు. ఆయనకు కార్మికుడిగా పని చేసిన అనుభవం ఉంది. నిరుపేద, నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన లూలా గత నాలుగు దశాబ్దాల నుంచి బ్రెజిల్‌ రాజకీయాల్లో నిరంతరం కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. కార్మిక సంఘ నాయకుడిగా సమ్మెలు నిర్వహించి 1980లో ఆయన శ్రామికవర్గ ఏలుబడి తీసుకొచ్చారు. ‘‘లూలా ప్రపంచంలోనే అత్యంత పలుకుబడి గలిగిన నాయకుడు’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారంటే సైద్ధాంతికంగా విరోధి అయిన వారి మన్నన కూడా పొందారనే. లూలా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చమురు, నౌకా నిర్మాణం బాగా పుంజుకున్నాయి. బ్రెజిల్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానానికి చేరుకుంది. అయితే లూలా రాజకీయ ప్రస్థానం చీకటి వెలుగుల సంగమం. ఇదివరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారు. 2017లో ఆయనకు తొమ్మిదిన్నరేళ్ల శిక్ష పడిరది. సుప్రీం కోర్టు జోక్యంవల్లే ఆయన 19నెలలు శిక్ష అనుభవించిన తరవాత విడుదలయ్యారు. ఆయనకు శిక్ష పడినందువల్ల 2018 ఎన్నికలలో పోటీ చేయలేక పోయారు. జైలు నుంచి బయటకు వచ్చిన లూలా ఆచరణాత్మక రాజకీయ పంథా అనుసరించారు. పెరుగుతున్న ఆకలి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడారు. వామ పక్షం వేపు మొగ్గే సామాజిక ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించే వారిని కూడగట్టి విస్తృత ప్రాతిపదికన వామపక్షం వేపు మొగ్గే మధ్యేమార్గ రాజకీయాలు అనుసరించారు. ఎన్నికల ప్రచార క్రమంలో లూలా తన వామపక్ష భావజాలాన్ని కొద్దిగా పలచన చేసుకున్నారు. క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేసే వర్గాన్ని ఆకర్షించడం కోసం బైబిల్‌ నుంచి అనేక అంశాలను ఉటంకించారు కూడా.
ఎన్నికలు హోరాహోరీగా జరగడం పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా స్వల్పం కావడంతో భవిష్యత్తులో ఎలా మెలగాలో లూలా గ్రహించారు. దేశం ఆత్మను పునరావిష్కరించి సంఫీుభావాన్ని సాధించాలని, విభేదాలను సైతం గౌరవించాలని అంటున్నారు. అందుకే తనకు ఓటు వేసిన వారికి మాత్రమే కాకుండా దేశవాసులందరి శ్రేయస్సు కోసం పాటు పడ్తానని భరోసా కల్పిస్తున్నారు. బ్రెజిల్‌ అంతా ఒకటే. బ్రెజిల్‌ ప్రజలందరూ ఒకటేనన్నది ప్రస్తుతం ఆయన ప్రధాన నినాదం. బోల్సనారోను ఓటమి భయం ముందు నుంచే పీడిస్తోంది. అయినా ఇంతవరకు తన పరాజయాన్ని అంగీకరించలేదు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోతే ఆ ఫలితాలను సవాలు చేస్తానని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ పరికరాలపైన నమ్మకం లేదని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్తూనే ఉన్నారు. బ్రెజిల్‌ కార్మికవర్గ పార్టీ నాయకుడైన లూలా సామాజిక అసమానతలు, పేదరికం రూపుమాపడం మీద దృష్టి కేంద్రీకరిస్తానని చెప్తూ వచ్చారు. సంపన్నుల మీద పన్నులు పెంచుతానని, విస్తృత ప్రజానీకానికి ఉపకరించే ఆర్థిక విధానాలు అనుసరిస్తానని, కనీస వేతనాలు పెంచుతానని లూలా హామీ ఇచ్చారు. దీనికి విరుద్ధంగా బోల్సనారో ప్రభుత్వరంగంలో ఉన్న చమురు కంపెనీలను ప్రైవేటీకరిస్తాననీ, అమెజాన్‌ ప్రాంతంలో ఖనిజాల తవ్వకానికి అనుమతిస్తానని, తుపాకుల లైసెన్సు పొందడానికి మార్గం సుగమం చేస్తానని ఉన్నత వర్గాలకు అనుకూల హామీల వర్షం కురింపించారు. బోల్సనారో ప్రవేశ పెట్టిన దుష్ట సంప్రదాయాలను తిరగదోడడం, తుపాకి రాజ్యాన్ని అంతమొందించడం, అమెజాన్‌ను సంరక్షించడం, అంతర్జాతీయంగా ఏకాకి అయిపోయిన బ్రెజిల్‌ ను మిగతా దేశాలతో అనుసంధానించడం లూలా తన తక్షణ కర్తవ్యాలుగా భావిస్తున్నారు. లూలా విజయం సాధించి ఉండవచ్చుగానీ ఆయన ఎదుట ఉన్న సవాళ్లు భీకరమైనవే.
అమెజాన్‌కు పర్యావరణ పరంగా జరిగిన నష్టాన్ని పూడ్చడం, సామాజిక, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే బృందాలను సమీకరించడం, విద్వేష ప్రచారాన్ని అంతం చేయడం లాంటి సవాళ్లను లూలా ఏ మేరకు ఎదుర్కోగలరో వేచి చూడాల్సిందే. అయితే నిరాశలో కుంగి పోయిన దేశ వాసులలో లూలా విజయం కొత్త ఆశలు చిగురింప చేసిందన్నది మాత్రం వాస్తవం. ప్రజాస్వామ్యం మీద ప్రజలకు మళ్లీ నమ్మకం కుదరడానికి లూలా విజయం సంకేతం. 2002 లో లూలా మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆయన రాజకీయ పంథా అప్పుడున్నట్టుగా లేదు. మధ్యవాదులతో రాజీపడక తప్పని స్థితిలో ఉన్నారు. బోల్సనారోను ఓడిరచడానికి ఆయన మధ్యేమార్గం వేపు మొగ్గవలసి వచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన కూటమిలో వామపక్ష వ్యతిరేకులూ ఉన్నారు. బ్రెజిల్‌ పార్లమెంటు ప్రస్తుతం మితవాదుల మయం అయిపోయింది. ఈ వైరుధ్యాలను సమన్వయం చేయడం లూలా ప్రథమ కర్తవ్యం అవుతుంది. బోల్సనారో మితవాద రాజకీయాలు అనుసరించడమే కాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు విరుద్ధంగా ఈ ఏడాది ఆరంభం నుంచే ప్రచారం చేస్తున్నారు. ఈ పరికరాల దుర్వినియోగం ఎలా సాధ్యమో మాత్రమో చెప్పలేక పోయారు. ఇలాంటి విలోమ రాజకీయాలు ప్రస్తుతానికి అంతమైనట్టు కనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో మళ్లీ తలెత్తబోవన్న నమ్మకం ఏమీ లేదు. అందువల్ల ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం కూడా లూలాకు పెద్ద పనే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img