తక్షణమే క్షమాపణ చెప్పాలి
నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం ` పిటిషన్ తిరస్కృతి
న్యూదిల్లీ : ప్రవక్త మహమ్మద్పై బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయని, పర్యవసానంగా దేశం తగలబడిపోతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె నోటి దురుసుతనం వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. నూపుర్ శర్మ వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలని సూచించింది. ఈ వ్యాఖ్యలను చౌకబారు ప్రచారం కోసమో లేక రాజకీయ అజెండాతోనే లేదంటే నేరపూరిత ఉద్దేశంతోనే చేసి ఉంటారని పేర్కొంది. తన వ్యాఖ్యలు రేపిన దుమారం క్రమంలో వేర్వేరు రాష్ట్రాల్లో నమోదు అయిన ఎఫ్ఐఆర్లను కలపేయాలన్న నూపుర్ శర్మ ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రవక్త మహమ్మద్పై నూపుర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారానికి అద్దం పట్టాయని, న్యాయవాదినని చెప్పుకునే ఆమెకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఆమె చేసిన పనికి దేశం తగలబడిపోతోంది. వీరు ఆధ్యాత్ములు కారు… ఇతర మతాలను గౌరవించరు. ముప్పు ఉన్నది ఆమెకా లేక దేశానికి ఆమెతో ముప్పు ఏర్పడిరదా? దేశంలోని ప్రస్తుత దురదృష్టకర పరిస్థితులకు ఆమె ఒక్కరే కారణం. ఆమె పాల్గొన్న చర్చలను మేము చూశాం’ అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నూపుర్ శర్మ తరపు న్యాయవాది సింగ్ వాదనలు వినిపింస్తూ ఆమె క్షమాపణ కోరారని కోర్టుకు చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ‘ ఆమె చాలా ఆలశ్యంగా స్పందించారు. అదీ కాకుండా మతపరమైన మనోభావాలను కించపర్చివుంటే అంటూ షరతులతో కూడిన క్షమాపణ చెప్పారు. ఆమె వెంటనే టీవీ మాధ్యమంగా దేశానికి క్షమాపణ చెప్పి ఉండాల్సింది’ అని పేర్కొంది. రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె అనుకోకుండా అలా మాట్లాడారని సింగ్ చెప్పగా ‘మీరు ఓ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడటానికి లైసెన్సు ఇచ్చినట్లు కాదు’ అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. చర్చలను దుర్వినియోగించి ఉంటే గనుక వెంటనే వ్యాఖ్యతపై ఎఫ్ఐఆర్ను ఆమె నమోదు చేసివుండాలని పేర్కొంది. చర్చల్లో పాల్గొన్న ఇతరుల వ్యాఖ్యలపై నూపుర్ శర్మ అలా స్పందించారన్న సింగ్ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘టీవీలో చర్చ పెట్టింది ఎందుకు? అగ్ని (అజెండా)కు ఆజ్యం పోసేందుకా? సబ్ జుడీస్ (కోర్టు పరిధిలో ఉన్న అంశం)ని ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నించింది. ఒకటే చర్యపై రెండవ ఎఫ్ఐఆర్ ఉండకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఇతర తీర్పులను సింగ్ ప్రస్తావించగా జస్టిస్ కాంత్ స్పందించారు. మరొక ఎఫ్ఐఆర్ నమోదు అయితే అందుకు ఆమె హైకోర్టును ఆశ్రయించవచ్చు అని అన్నారు. ఈ క్రమంలో అర్నబ్ గోస్వామి కేసును సింగ్ గుర్తు చేయగా ‘ఒక అంశంపై తన హక్కును పాత్రికేయుడు వినియోగించుకోవడం.. రాజకీయ పార్టీ అధికార ప్రతినిధినిగా ఇతరులనుద్దేశించి నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేయడం ఒకటి కాదని న్యాయస్థానం పేర్కొంది. దిల్లీ పోలీసుల విచారణకు సహకరిస్తున్నారని, ఆమె పారిపోవడం లేదని సింగ్ అంటే ‘ఇప్పటివరకు దర్యాప్తులో జరిగింది ఏమిటి? దిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఏం చేశారు? మా నోళ్లు తెరిపించొద్దు… మీకోసం ఎర్రతివాచీ పరిచివుంటారుగా’ అని కోర్టు వ్యాక్యానించింది. దాదాపు 30 నిమిషాలు సాగిన విచారణ అనంతరం నూపుర్ శర్మ పిటిషన్ను తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.