ఈ ఏడాది (2021) నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు పాత్రికేయులకు లభించింది. తమ దేశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడినందుకు
జర్నలిస్టులు..ఫిలిప్పైన్స్కు చెందిన మరియా రెస్సా,రష్యాకు చెందిన దిమిత్రి మురతోవ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.వీరిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణకు, సుస్థిర శాంతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు చేసిన కృషికి ఈ అవార్డును అందుకోగలిగారని నార్వేజియన్ నోబెల్ కమిటీ అధ్యక్షురాలు బెరిట్ రీస్-ఆండర్సన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం పరిరక్షణ, పత్రికా స్వేచ్ఛకు పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ వీరిద్దరూ ప్రతినిధులని నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు క్రింద విజేతలకు ఓ బంగారు పతకం, సుమారు 1.14 మిలియన్ డాలర్లు లభిస్తాయి. స్వీడిష్ ఇన్వెంటర్ ఆల్ఫెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా ఈ బహుమతులను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది.