ఎయిరిండియా విక్రయ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా, టాటా సన్స్ను విజయవంతమైన బిడ్డర్గా ఎంపిక చేసినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. చివరి వరకు పోటీ పడిన స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ.15,100 కోట్లకు బిడ్ వేశారు. అయితే చివరకు ఎయిరిండియా ఓపెన్ బిడ్ను టాటా సన్స్ గ్రూప్ రూ. 18 వేల కోట్లకు దక్కించుకుంది.ఎయిరిండియా యజమాని ఇదే కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తొలుత వార్తలు వెలువడినట్లే ఎయిరిండియా తిరిగి టాటా సన్స్ టేకోవర్ చేసుకున్నది. దీంతో 68 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎయిరిండియా దాని ఫౌండర్ల చేతుల్లోకే వెళ్లనుంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.