. ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యాలు అందాలి
. ఇది కేంద్రప్రభుత్వ బాధ్యత : సుప్రీంకోర్టు
న్యూదిల్లీ:
ఎవరూ పస్తులు ఉండరాదు… ఖాళీ కడుపుతో నిద్రపోయే దుస్థితి రాకూడదు… చివరి వ్యక్తికీ జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ఆహార ధాన్యాలు అందించటం కేంద్రప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ`శ్రమ్ పోర్టల్ కింద నమోదైన వలస కూలీలు, అసంఘటిత కార్మికుల సంఖ్యతో తాజా జాబితాను సమర్పించాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం మంగళవారం కేంద్రానికి సూచించింది. ‘కేంద్రం ఏమీ చేయడం లేదని అనడంలేదు. కోవిడ్ కాలంలో ఆహార ధాన్యాల పంపిణీని కేంద్రం చేపట్టింది. అది ఇప్పుడు కొనసాగేలా చూడాలి. ఎవరూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి రాకూడదు. ఖాళీ కడుపుతో ఎవరినీ నిద్రపోనివ్వకపోవడం మన సంప్రదాయం’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ల పర్యవసానంగా వలసకూలీల వెతలపై ప్రజా ప్రయోజనం వ్యాజ్యం (పిల్)ను న్యాయస్థానం విచారించింది. ముగ్గురు సామాజిక కార్యకర్తలు అంజలీ భరద్వాజ్, హర్ష్ మండర్, జగదీప్ ఛోకర్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. 2011 జనగణన తర్వాత దేశ జనాభా పెరిగిన క్రమంలో ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులూ పెరిగారని, ఎన్ఎఫ్ఎస్ఏ సమర్థంగా అమలు కాకపోతే అవసరార్థులో చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఇటీవల సంవత్సరాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నదిగానీ ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భారతి వాదనలు వినిపించారు. ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు 81.35 కోట్ల మంది ఉన్నారని 2011 జనగణన తర్వాత అదనంగా లబ్ధిదారుల చేర్పింపులను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. భూషణ్ కలగజేసుకొని తమ ఆహార ధాన్యాల కోటా అయిపోయిందని 14 రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేశాయని తెలిపారు. ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తును గురువారానికి వాయిదా వేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి పౌరునికి ఆహార హక్కు ఉన్నదని, ఎన్ఎఫ్ఎస్ఏ ప్రయోజనాలను విస్తరించాలని కేంద్రానికి అంతకుముందే సూచించింది.