ప్రధాని మోదీ వెల్లడి
ఇండోర్ : ఆసియాలో అతిపెద్ద బయో-సీఎన్జీ ప్లాంటును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఇండోర్లో ఉన్న ఈ ప్లాంటును వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ఇళ్లు, జంతువులు, సాగు భూముల నుంచి వచ్చే తడి వ్యర్థాలు ఓ విధంగా గోబర్ (ఆవు పేడ) ధనమని చెప్పారు. రానున్న రెండేళ్లలో 75 మేజర్ మునిసిపాలిటీల్లో ఇటువంటి గోబర్ ధన్ బయో సీఎన్జీ ప్లాంట్ల నిర్మాణానికి కృషి జరుగుతోందని చెప్పారు. మన దేశంలోని నగరాలు పరిశుభ్రంగా మారడానికి ఇవి దోహదపడతాయన్నారు. వీటివల్ల నగరాలు కాలుష్య రహితమవుతాయని, పరిశుద్ధ ఇంధనం వస్తుందని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి పాల్గొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడిరచిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలలో ఘన వ్యర్థాల ఆధారిత గోబర్ ధన్ ప్లాంట్లను స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా నిర్మిస్తున్నారు. నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. వేరుపరచిన సేంద్రీయ తడి వ్యర్థాలను ఈ గోబర్ ధన్ ప్లాంటు శుద్ధి చేస్తుంది. దీనిలో రోజుకు 550 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసి, దాదాపు 17వేల కేజీల సీఎన్జీని, 100 టన్నుల కంపోస్టును ఉత్పత్తి చేయవచ్చు. గ్రీన్హౌస్ వాయుఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఆర్గానిక్ కంపోస్టు (సేంద్రియ ఎరువు)ను ఎరువుగా అందజేయడానికి వీలవుతుంది.