. స్తంభించిన రవాణా
. రాకపోకలకు అంతరాయం
. బకాయిలు చెల్లించాలని డిమాండ్
. 5 లోగా చెల్లిస్తామని అధికారుల హామీ
విశాలాంధ్ర`నిండ్ర: నేతం సుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. తక్షణమే తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోతే అగ్రగోల్డ్ తరహాలో ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని విన్నవించారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో గల నేతం సుగర్ ఫ్యాక్టరీ మూడేళ్లుగా రైతులకు చెరకు బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులు ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకోకు దిగారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరి ఆర్డీవో, నిండ్ర తహసీల్దార్, చెరకు శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ సహా పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నాంచారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఒకదశలో పోలీసులకు, రైతులకు తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడిరది. చెరకు విభాగానికి చెందిన కమిషనర్పై రైతులు ఆగ్రహం వెలిబుచ్చారు. కమిషనర్ మెతక వైఖరి వల్లనే మూడేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదని, కమిషనర్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. నాలుగు మండలాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ తరహాలో ప్రభుత్వమే చెల్లించాలి: జనార్ధన్
ప్రభుత్వ నిబంధనల మేరకు చెరకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా మూడేళ్లయినా రూ.37 కోట్లు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ రైతుసంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టి.జనార్దన్ విమర్శించారు. రైతుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల వేళ సహకార చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. గురవారెడ్డి కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సహకార ఫ్యాక్టరీలు తిరిగి ప్రారంభించాలని, ప్రైవేట్ ఫ్యాక్టరీల బకాయిలు సత్వరం చెల్లించేటట్లు చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లించిన తరహాలో నేతం సుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.37 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 5వ తేదీ నుండి రైతులు చేపట్టే ప్రత్యక్ష ఆందోళనలో ఏపీ రైతుసంఘం పాల్గొంటుందని తెలిపారు. నేతాజీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ మూడేళ్లుగా రైతుల సహనాన్ని పరీక్షించడం తగదని, సత్వరం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో రైతుల పక్షాన ప్రభుత్వం గట్టిగా వాదించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. కాగా, రైతులకు చెరకు బకాయిలు చెల్లించడం మొదలైందని, నవంబర్ 5 నాటికి పెద్ద మొత్తం చెల్లిస్తామని, రైతులు సంయమనం పాటించలని కేన్ కమిషనర్ కోరారు. నవంబర్ 5వ తేదీకి బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. టీడీపీ నాయకులు భాను ప్రకాశ్, చినబాబు, రైతుసంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, కిశోర్, గుణశేఖర్రెడ్డి, సీపీఐ నగిరి కార్యదర్శి వేలన్ తదితరులు పాల్గొన్నారు.