బ్రిటన్ కొత్త ప్రధాని సునాక్
లండన్ : ‘‘మాటలతో కాకుండా కార్యాచరణతో నేను మనదేశాన్ని ఐక్యపరుస్తాను. అందుకొరకు రాత్రింబవళ్లు నేను కృషి చేస్తాను. విశ్వాసం సంపాదించుకోవాలి.. నేను సంపాదిస్తాను. ఈ తీర్పు మనందరిదీ, అందరినీ ఐక్యంగా వుంచేందుకు సంబంధించింది. మన తీర్పునకు గుండె కాయవంటిది మన ప్రణాళిక’’ అని ప్రధానమంత్రిగా తన తొలి ప్రసంగంలో రిషి సునాక్ ఉద్ఘాటించారు. బ్రిటన్ ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, రుణవ్యయాలు పెరిగిపోవటం, అనివార్య ఆర్థికమాంద్యం దృష్ట్యా కష్టపడి పనిచేస్తానని సునాక్ ప్రతినబూనారు. పార్టీలో విభజన, అంతర్గత కుమ్ములాటల దృష్ట్యా పార్టీని ఐక్యం చేయవలసిన బృహత్తర కర్తవ్యాన్ని కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఐక్యతపై ‘ఆఖరి అవకాశ వేదిక’’ గా వుందని థెరీసామే, జాన్సన్ టోరీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన గవిన్ విలియంసన్ అన్నారు. నేడు పార్లమెంటులో ‘ప్రధానమంత్రి ప్రశ్నల’’ మొదటి సమావేశాన్ని ఎదుర్కోటానకి ముందుగానే తన మంత్రివర్గ బృందాన్ని నియమించటం సునాక్ ప్రారంభిస్తారు. సునాక్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రానున్న కాలంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ‘కోవిడ్ సమయంలో ప్రజలను, వాణిజ్యవేత్తలను రక్షించేందుకు నేను చేయగలిగిన ప్రతిదీ చేయడాన్ని మీరు చూశారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిమితులు వున్నాయి. నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళను దయార్థ్ర హృదయంతోనే పరిష్కరిస్తానని వాగ్ధానం చేస్తున్నాను. నేను నేతృత్వం వహించే ప్రభుత్వ రుణాన్ని భవిష్యత్ తరానికి, మీ పిల్లలకు, మనవళ్లకు విడిచిపెట్టకుండా పరిష్కరించడానికి కృషి చేస్తాను.