ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయాలపై హైకోర్టు స్టే
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం కొలిక్కి రావడం లేదు. ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం, అది మంచి పద్దతి కాదని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతుండడంతో చివరకు ఈ వివాదం హైకోర్టుకి చేరింది. దీనిపై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయ విధానంపై హైకోర్టు స్టే విధించింది. సినిమా టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆన్లైన్ విధానం తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. అందు కోసం ప్రభుత్వ పరిధిలోని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలో నిర్వహించే పోర్టల్ ద్వారా ఈ టికెట్లను అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం పై సినీ పెద్దలతో కూడా సీఎం జగన్, నాటి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొందరు సినీ పెద్దలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నెల రోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్లకు డబ్బు ఎన్ని రోజుల్లో జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో ఎగ్జిబిటర్లు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 పైన స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అమలు నిలిపేసింది. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.