ర్యాలీపై తూటాల వర్షం
ఆఫ్ఘనిస్తాన్లో 102వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయజెండాలతో ర్యాలీ చేపట్టిన వారిపై తాలిబాన్లు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఈ సారి తాలిబాన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే అసద్బాద్లో కొందరు 102వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయజెండాలతో ర్యాలీ చేపట్టగా వారిపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్
కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తాలిబాన్లు ఓ కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ అని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. 1996-2001 మధ్య కాలం తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు వారు దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ అని పిలిచేవారు. 2001లో అమెరికా దళాలు.. ఆ పేరులోంచి ‘ఇస్లామిక్ అమిరేట్’ అనే పదాన్ని తొలగించాయి.తాజాగా తాలిబాన్లు మునుపటి పేరును పునరుద్ధరించారు.