అక్రమ కాలనీలపై సుప్రీం
అక్రమ కట్టడాల నివారణకు చర్యలు చేపట్టాలి
న్యూదిల్లీ : అక్రమంగా నిర్మాణమవుతున్న కాలనీలు పట్టణాభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా చాలా పట్టణాలు, నగరాల్లో అక్రమ కాలనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ఇది పట్టణాభివృద్ధికి పెనుముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ, తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లోని అక్రమంగా నిర్మించిన లే అవుట్లను క్రమబద్దీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్ రావు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వివిధ సంస్థలు అక్రమంగా నిర్మిస్త్తున్న కాలనీలతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సరైన వసతులు, అనుమతులు లేకుండా చేపడుతున్న కాలనీల నిర్మాణాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయని, ట్రాఫిక్, డ్రైనేజీ తదితర సమస్యలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఆ కాలనీలను క్రమబద్దీకరించడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంతో పర్యావరణ శాఖ అనుమతులు కూడా తీసుకోవడం లేదని తెలిపారు. అక్రమ కాలనీల నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అవసరముందని వాదించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో నిజం ఉన్నట్టు పేర్కొంది. నగరాలు, పట్టణాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ కాలనీలు పుట్టుకొస్తున్నాయని దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నట్టు తాము గుర్తించామని పేర్కొంది. హైదరాబాద్, కేరళలో సంభవించిన వరదలను గుర్తు చేస్తూ ఇదంతా అక్రమకాలనీల కారణంగానేనని పేర్కొంది. అక్రమ కాలనీలతో పట్టణాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ రెండు వారాల్లో అక్రమ కట్టడాల నివారణకు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించింది.