అల్పపీడన ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీవర్షాలు కురవవచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండి) మంగళవారం వెల్లడిరచింది. రాగల మూడు రోజుల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండి అధికారులు హెచ్చరించారు. లక్షద్వీప్, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో 6,7,9 తేదీల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. కేరళ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీంతో కేరళలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరువనంతపురంలో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, మణప్పురం, కోజికోడ్, వయనడ్, కన్నూర్ జిల్లాల్లోనూ భారీవర్షాలు కురిశాయి.తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి,మెట్టుపాలయం, ఉద్గమండలం ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లార్ హిల్ గ్రోవ్ ప్రాంతాల్లో రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. కర్ణాటక రాజధాని బెంగళూరు గత రెండు రోజులుగా వరద నీటిలోనే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఐటి హబ్ కూడా వరదల్లో మునిగిపోవడంతో ఉద్యోగులు ట్రాక్టర్లు, క్రేన్ల ద్వారా కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ వరదలతో 430 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 2,188 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలు రహదారులు, బ్రిడ్జీలు, విద్యుత్ స్థంబాలు దెబ్బతిన్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు దక్షిణ, ఉత్తర కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.