. పైప్లైన్ తొలగించాలని డిమాండ్
. కాకినాడ జిల్లాలో బోట్లకు నిప్పంటించి నిరసన
. మత్స్య సంపద కనుమరుగవుతుందని ఆవేదన
. ‘అరబిందో’కు వ్యతిరేకంగా నినాదాలు
విశాలాంధ్ర-యు.కొత్తపల్లి: తమ జీవనోపాధిని దెబ్బతీసే పైప్లైన్లను తక్షణమే తొలగించాలంటూ మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనతో విసిగివేసారిన మత్స్యకారులు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. తమ బోట్లకు తామే నిప్పుపెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కోనపాపపేటలో వందలాది మత్స్యకార కుటుంబాలు కాకినాడ-అద్దరిపేట రహదారిపై బైఠాయించి ‘అరబిందో’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కడం వల్లనే తిరిగి ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా తొండంగి మండలం కోనపాపపేటలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ సముద్రంలోకి పైప్లైన్ వేయడంతో మూడు రోజులుగా బీచ్ రోడ్లో భారీస్థాయిలో మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు. అధికారులు, రాజకీయ నేతల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారులు బీచ్ రోడ్డుపై బైఠాయించారు. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు తమ బోట్లుకు తామే నిప్పంటించుకొని నిరసన తెలియజేశారు. పైప్లైన్ తక్షణమే తొలగించాలంటూ మరికొందరు మత్స్యకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పైప్లైన్ వలన వ్యర్థాలు సముద్రంలోకి చేరి మత్స్య సంపద కనుమరుగై పోతుందని మండిపడ్డారు. వేటకు వెళితే బోట్లు ధ్వంసం అవుతాయని, వలలు చిరిగిపోతాయని, మత్స్య సంపద లభించక ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ధర్నాలు చేపడితే పైప్లైన్ తొలగిస్తామని అధికారుల హామీ ఇచ్చారనీ, కానీ ఇప్పటికీ పైపులైన్లు తీయించలేదని వాపోయారు. హామీలు తుంగలో తొక్కడం వల్లనే తిరిగి ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు.
రెండు, మూడు రోజుల్లో పైపులైను తొలగిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. కొందరు మత్స్యకార మహిళలు సైతం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఏక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీచ్ రోడ్డుపైనే టెంట్లు వేసుకుని సాయంత్రం వరకు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిరది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.