అంతర్జాతీయ వేదికపై ప్రసంగంతో ఆకట్టుకున్న 14 ఏళ్ల భారత బాలిక
తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్. తాజాగా ప్రిన్స్ విలియమ్స్ ఆహ్వానం మేరకు గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్26)లో పాల్గొని ‘క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్’ అనే అంశంపై ప్రసంగించింది. పలు అంశాలపై మాట్లాడిన ఆమె తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నది. మన దేశ ప్రధాని, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ వంటి ప్రపంచ నేతలు హాజరైన ఈ సమావేశంలో ఏ మాత్రం బెదరకుండా తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పింది. వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతున్న ప్రపంచ నేతలపై నేటి తరం యువత ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. ఈ భూగోళాన్ని రక్షించేందుకు నేతలంతా యాక్షన్లోకి దిగాలని తెలిపింది. ఎంతో మర్యాదపూర్వంగా ప్రపంచ నేతలను అడగాలనుకుంటున్నానని, ఇక నుంచి మాట్లాడడం మానేసి, చేతల్లో చేసి చూపించాలని ఆ అమ్మాయి పేర్కొన్నది. ఎర్త్షాట్ ప్రైజ్లు గెలిచినవాళ్లు, ఫైనలిస్టులు ఎన్నో రకాల ఆవిష్కరణలు, ప్రాజెక్టులు చేశారని, వారి వద్ద ఎన్నో పరిష్కారాలు కూడా ఉన్నాయని, అయితే పాత పద్ధతుల్లో ఆలోచన చేయడం మానివేయాలని, కొత్త భవిష్యత్తు కోసం కొత్త విజన్ను రూపొందించాలని పేర్కొంది. మా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను పెట్టుబడిగా పెట్టాలని ఆమె ప్రపంచ నేతలను కోరింది. ‘నేను ఓ విద్యార్థిని, పర్యావరణవేత్తను, అంతకంటే మించి ఓ ఆశావాదిని, ఇప్పుడు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఒక్కటే. మాటలు వద్దు, చేతలు కావాలి…మా వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి. మా బంగారు భవిత కోసం ప్రయత్నాలు చేయండి. పాత అలవాట్లను ఇకనైనా వదిలిపెట్టండి. లేదు..మేం అక్కడే అగిపోతాం అన్నా ఫర్వాలేదు. మా భవిష్యత్తును మేం నిర్మించుకుంటాం. అందుకోసం దయచేసి మాతో చేతులు కలపండి.’ అంటూ వినీశా ప్రసంగించింది. వీధి వ్యాపారుల కోసం వినీషా ఉమాశంకర్ 12 ఏళ్ల వయస్సులోనే సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండిని డిజైన్ చేసింది.‘ఎర్త్ షాట్ ప్రైజ్’ పోటీలకు వెళ్లి ఫైనల్ వరకు చేరింది.