9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ బృందాలు
దేశంలో పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, దిల్లీి, జమ్మూ అండ్ కశ్మీరు రాష్ట్రాల్లో డెంగీ కలవరపెడుతోంది. దిల్లీలో 1530 డెంగీ కేసులు వెలుగుచూశాయి. అక్టోబరు నెలలోనే అత్యధికంగా 1200 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను పంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రాల నిపుణులను ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి. 9 రాష్ట్రాల్లో డెంగీ నివారణపై సమీక్షించి దీని నివారణకు సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులను ఆదేశించారు.