రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా ఉక్రెయిన్ తరపున రష్యాపై యుద్ధం చేయనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.
రాజధాని కీవ్లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేశారని, ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థులంతా రైళ్ల ద్వారా పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు తాజాగా ఓ ట్వీట్ చేసింది. ప్రజల తరలింపునకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతోందని గుర్తుచేసింది.భారతీయ విద్యార్థులు ఈ ప్రత్యేక రైళ్లలో పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్, రోమానియా దేశాలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి భారతీ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.