పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.అయితే రాహుల్ గాంధీ డిమాండును ప్రభుత్వం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదని, రాజకీయంగా విఫలమైన వారు దీన్ని ఓ సమస్యగా చూపుతున్నారని, అసలు ఇది సమస్యే కాదని హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ శుక్రవారం మీడియాతో అన్నారు. దీనికి ముందు, పెగాసస్ వ్యవహారంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఇదే అస్త్రం ఉపయోగించారని తప్పుపట్టారు. తన ఫోను కూడా ట్యాప్ చేశారని, దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలకు తన మిత్రులు సమాచారం ఇచ్చారని చెప్పారు. పెగాసస్ పై విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై న్యాయవిచారణ జరిపించాలని, హోం మంత్రి అమిత్షా రాజీనామా చేయాలని డిమాండు చేశారు.