. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
. చిత్తూరులో అమూల్ డెయిరీకి భూమి పూజ
. చంద్రబాబు, పవన్పై విరుచుకుపడ్డ సీఎం
విశాలాంధ్ర-చిత్తూరు: రాష్ట్రంలో నిర్వీర్యమైన సహకార రంగానికి జీవం పోస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని విజయ సహకార డెయిరీ ప్రాంగణంలో అమూల్ డెయిరీ నిర్మాణానికి సీఎం జగన్ మంగళవారం భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు. ప్రతిష్ఠాత్మక చిత్తూరు సహకార విజయ డెయిరీని చంద్రబాబు తన స్వార్థం కోసం పథకం ప్రకారం మూసివేశారని జగన్ విమర్శించారు. అనేక సహకార ఫ్యాక్టరీలను నష్టాల్లోకి నెట్టి వేలాదిమంది కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు అండగా ఉంటూ రోజుకు రెండు లక్షల లీటర్ల వరకు పాల సేకరణ చేస్తున్న డెయిరీని మూసివేసేందుకు చంద్రబాబు భారీ కుట్ర అమలు చేశారన్నారు. ప్రణాళిక ప్రకారం పాల సేకరణ తగ్గిస్తూ నష్టాలు చూపి…2002లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు డెయిరీని మూసివేసిందన్నారు. కేవలం తన సొంత హెరిటేజ్ సంస్థ ప్రయోజనాల కోసమే చిత్తూరు డెయిరీని మూసివేశారన్నారు. సొంత లాభం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులను బలిపెట్టారన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డెయిరీని పునరుద్ధరించడానికి భూమి పూజ చేశామన్నారు. అమూల్ సంస్థ అధ్వర్యంలో ఇది నడుస్తుందని చెప్పారు. రూ.385 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ డెయిరీ ద్వారా ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షలాది మంది పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బోనస్ వస్తుందన్నారు. దశలవారీగా ఈ డెయిరీ విస్తరించి రోజుకు 10 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేలా చర్యలు చేపట్టడంతో పాటు వివిధ రకాల పాల ఉత్పత్తులను సైతం ఇక్కడ తయారు చేసే అవకాశం ఉందన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 54 సహకార, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం లేదా విక్రయించడం చేసిందని జగన్ విమర్శించారు. ఆ సంస్థలను కూడా తన అనుయాయులకు కారు చౌకగా కట్టబెట్టిందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ సచివాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. 2004లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుంటే ఆర్టీసీ, ఆసుపత్రులు, పాఠశాలలను సైతం అమ్ముకునేవాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు సమీపంలో సీఎంసీ ఆసుపత్రికి కొంత భూమి కేటాయించారని, దీనికి సైతం చంద్రబాబు అడ్డుపడ్డారన్నారు. ఆ భూమిని కొందరు ఆక్రమించుకున్నారన్నారు. ఆయన బిడ్డగా చిలపల్లి వద్ద సీఎంసీ ఆసుపత్రి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబు గిమ్మికులు చేస్తున్నారని, దత్తపుత్రుడిని సైతం జనంలోకి వదులుతున్నారన్నారు. చంద్రబాబును వెన్నుపోటు వీరుడిగా, పవన్ కల్యాణ్ను ప్యాకేజీ శూరుడగా సీఎం అభివర్ణించారు. విపక్షాలకు దోచుకోవడం, పంచుకోవడం, తిసుకోవడం తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను నాడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఇంగ్లీష్ బోధనను, ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను ప్రజలే నిలదీయాలన్నారు. పెత్తందారులకు, పేదవారికి మధ్య యుద్ధం కొనసాగుతున్నదన్నారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది కొలమానంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గుడిపాల మండలం చీలపల్లి వద్ద వేలూరు సీఎంసీ ఆసుపత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.