ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తదితరుల అరెస్ట్
విశాలాంధ్ర` తిరుపతి: లేబర్ కోడ్ల అమలు కోసం గురు, శుక్రవారా లలో తిరుపతి నగరంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వత్తాసుతో మోడీ సర్కార్ నిర్వహిస్తున్న సమావేశాని కి కార్మిక సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. వివిధ కార్మిక సంఘాల కార్యాలయాల్ని తెల్లవారే పోలీసులు ముట్టడిరచారు. కొందరు ముఖ్య కార్మిక నేతల ఇళ్లకి కాపలా పెట్టారు. నిర్బంధ వాతావరణం సృష్టించారు. వివిధ చోట్ల విభిన్న బృందాలు నిరసన చేపట్టాయి. నిరసనకు దిగిన కార్మిక సంఘాల రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అనుబంధ కార్మిక సంఘాల నేతలు వంద మందిని మించే పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సగం మంది మహిళలే. తిరుపతి నగరానికి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉన్న రామచంద్రాపురంలో వారిని అదుపులో ఉంచారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయాన్ని వందమందికి పైగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతిలేదంటూ నాయకులతో వాగ్వాదానికి దిగారు. కార్యాలయం నుంచి రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుమార్ రెడ్డి, రాధాకృష్ణతోపాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తోందని విమర్శించారు. ఈ చట్టాలను నాలుగు లేబర్కోడ్లుగా మార్చడం అన్యాయమన్నారు. నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకు వేదికగా తిరుపతిని అనుమతించడం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తగదన్నారు. తక్షణం లేబర్ కోడ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో కార్మికుల ఉద్యమాలను ఆపలేరని రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్టుఅయిన వారిలో ఏఐటీయూసీ నాయకులు ఎన్. శ్రీరాములు, ఎన్. శివ, వైవస్ మణి, నాగరాణి, మహేంద్ర, నాగభూషణం, నరసింహులు, హమాలీ బాబు, రమణ, ముని బాలాజీ, సరిత తదితరులు వున్నారు.