. త్వరలో నిర్మాణపనుల ప్రారంభం
. రాజధాని ప్రాంతంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: గత ఐదేళ్లుగా ప్రశ్నార్థకంగా మారిన అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ పరుగులు పెట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రాజెక్టుల్లో అమరావతి, పోలవరం కీలకమైనవి. 2014
19 మధ్య కాలంలో ఈ రెండిరటికీ ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణపనులను రివర్స్ టెండరింగ్ పేరుతో అర్థాంతరంగా నిలిపివేసింది. ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక భవనాలు 30 నుంచి 80శాతం వరకు పూర్తి చేసుకుని మొండిగోడలుగా నిల్చిపోయాయి. రాజధాని నిర్మాణానికి ఉచితంగా భూములిచ్చిన రైతులు గత ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం నిర్వహించారు. మరోవైపు న్యాయపోరాటం కూడా చేశారు. హైకోర్టు మూడు రాజధానుల నిర్ణయం చెల్లదని, రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి రాజధానిని ఆరు నెలల్లో పూర్తి చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి మళ్లీ పునర్వైభవం రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలి పర్యటనగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం, తనకు రెండో ప్రాధాన్య అంశమైన రాజధాని ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి బయలుదేరి రాజధాని నిర్మాణాలను వరుసగా పరిశీలించనున్నారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఐకానిక్ నిర్మాణాల కోసం రాక్ ఫౌండేషన్ పనులు పూర్తి చేసిన ప్రదేశాలను కూడా సీఎం పరిశీలిస్తారు. అలాగే 70, 80 శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు, న్యాయమూర్తుల కోసం నిర్మించిన భవనాలను వరుసగా చంద్రబాబు పరిశీలిస్తారని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ మీడియాకు తెలిపారు. చివరిగా సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడే చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని మంత్రి వివరించారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు.
దీనికోసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయసలహా తీసుకుని ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.