ఉక్రెయిన్లో భారత పౌరులు, విద్యార్థులు బందీలుగా ఉన్నారంటూ వస్తోన్న ప్రచారంపై విదేశాంగ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. విద్యార్థులు బందీలుగా ఉండటంపై తమకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఖార్కీవ్లో కొందరు భారత విద్యార్థులను ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది బందీలుగా పట్టుకొన్నట్లు రష్యా నిన్న ఆరోపించింది. ఈ ప్రచారంపై ఎంఈఏ స్పందించింది. ‘‘ఉక్రెయిన్లోని మన ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ నుంచి వేలాదిమంది భారతీయులను తీసుకురాగలిగామని బాగ్చీ తెలిపారు.