కథువా గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బాల నేరస్థుడు కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అతన్ని వయోజనుడిగా గుర్తిస్తూ ఆ కేసులో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కథువాలో 2019లో ఎనిమిదేళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. వయసు విషయంలో ఆధారాలు లేని సమయంలో.. వైద్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ కేసులో కోర్టు పేర్కొన్నది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. నిందితుడికి చెందిన వయసు ద్రువ పత్రాలు ఏమీ లేవని, ఆ పక్షంలో మెడికల్ ఓపీనియన్ను ఆమోదించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది.ఈ కేసులో కథువా చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టిపారేసింది. ఆ నిందితుడు జువెనైల్ అని కథువా మెజిస్ట్రేట్ గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కథువా రేప్ కేసులో ప్రత్యేక కోర్టు ముగ్గురికి జీవితఖైదీ శిక్షను విధించింది. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీసుల ఆఫీసర్లకు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఓ నిందితుడిపై విచారణను జువెనైల్ జస్టిస్ బోర్డ్కు తరలించారు.