‘సిడ్నీ డైలాగ్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
క్రిప్టో కరెన్సీ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘ది సిడ్నీ డైలాగ్’ సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా టెక్నాలజీ : ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్’ అనే అంశంపై ప్రధాని కీలక ప్రసంగం చేశారు. క్రిప్టో కరెన్సీలు అక్రమార్కులు, దుర్మార్గుల చెంతకు చేరకుండా ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్లో క్రిప్టోపై ఎలా ముందుకు వెళ్లాలని ఇటీవల మోదీ.. బ్యాంకింగ్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన వార్నింగ్ సందేశం ఇచ్చారు. మనీల్యాండరింగ్కు, టెర్రర్ ఫైనాన్సింగ్కు క్రిప్టోమార్కెట్లకు వేదికగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.టెక్నాలజీ, డేటాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయని, అందుకే డేటా గవర్నెన్స్లో ప్రజాస్వామ్య దేశాలు సహకరించుకోవాలన్నారు. ‘క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ సమష్టిగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. లేదంటే అది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉంది.’ అని తెలిపారు. డిజిటల్ యుగం మనం చుట్టు ఉన్న అన్నింటినీ మార్చేస్తోందని, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజం అన్ని మారిపోయినట్లు మోదీ తెలిపారు. సౌభ్రాతృత్వం, పరిపాలన, నీతి, చట్టాలు, హక్కులు, భద్రత అన్నింటిపై డిజిటల్ ప్రభావం పడినట్లు ప్రధాని తెలిపారు. డిజిటలైజేషన్తో అంతర్జాతీయ పోటీతత్వంలోనూ మార్పు వచ్చిందన్నారు.