చంద్రబాబుది చంద్రముఖి పాలన: సీఎం జగన్
డ్రీమ్ మీది… స్కీమ్ నాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కలలను సాకారం చేశానని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చానని తెలిపారు. మంగళవారం విజయనగరం నియోజకవర్గం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభ జరిగింది.
విశాలాంధ్ర విజయనగరం : డ్రీమ్ మీది… స్కీమ్ నాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కలలను సాకారం చేశానని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చానని తెలిపారు. మంగళవారం విజయనగరం నియోజకవర్గం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభ జరిగింది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్ను నిర్ణయిస్తాయన్నారు. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ, దత్తపుత్రుడు, పత్రికలు ఉన్నాయని, వీటితో పాటు కుట్రలు, కుతంత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. జగన్ ఇంటింటికీ మంచి చేయకపోతే ఇంతమంది తోడేళ్ల అవసరం ఎందుకని ప్రశ్నించారు. ప్రతి వర్గానికి తాను మంచి చేస్తే, చంద్రబాబు వర్గం మాత్రం మోసం చేసిందన్నారు. మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసిన వారిని 420 అనే అంటారని, వారిని చంద్రముఖి బృందమనీ కూడా అందామన్నారు. 130 సార్లు సంక్షేమ పథకాల బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందించామన్నారు. ఇళ్ల స్థలాలు వంటి పథకాల కింద మరో లక్ష కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చామని ఆయన వివరించారు. పథకాలలో సింహభాగం మహిళలకేనని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎందుకు అభివృద్ధి జరగలేదనేది అందరూ ఆలోచించాలన్నారు. వలంటీర్ల ద్వారా నేరుగా అవ్వా తాతలకు రూ.3 వేల పెన్షన్ పథకం తెచ్చింది మీ బిడ్డేనని తెలిపారు. చదువుకున్న యువతకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. పంటలకు 9 గంటల ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. చంద్రబాబుని నమ్మాలా వద్దా ఆలోచించాలని, గతంలో కూడా ఇవే పార్టీలతో కూటమిగా వచ్చారని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న కోలగట్ల, శంబంగి చినఅప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, తలే రాజేష్, బొత్స అప్పలనర్సయ్య, కిరణ్, బొత్స సత్యనారాయణను పరిచయం చేసి గెలిపించాలని కోరారు.