. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
. ముత్యంలా బయటికి వస్తానని ధీమా
. ఒకటిన బెయిల్పై విచారణ
న్యూదిల్లీ:
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మంగళవారం తీహారు జైలుకు తరలించారు. ఈడీ కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కొంతమంది నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయిందని, అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. రెండువైపులా వాదనలు విన్న కోర్టు…కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకూ కవిత్ రిమాండ్ కొనసాగనుంది. దీంతో ఆమెను తిహార్ జైలుకు అధికారులు తరలించారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. కోర్టుకు హాజరుపరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇది తప్పుడు కేసు అని, మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వెలిబుచ్చారు.
తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఎంపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీకి ముట్టచెప్పాడని కవిత చెప్పారు. జై తెలంగాణ… జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఆమె కోర్టులోకి వెళ్లారు.