లక్నో: ధరల పెరుగుదలపై రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా స్పందిస్తున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ ప్రజలపై మోయలేని భారం వేయడం తగదని మోదీ సర్కారుకు హితవు చెబుతున్నాయి. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం స్పందిస్తూ పెట్రో ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధర 16 రోజుల్లో ఏకంగా 10 రూపాయలు పెరగడంతో మాయావతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దారిద్య్రం వంటి సమస్యలతో ప్రజలు ఇప్పటికే సతమతమవుతున్నారని, ఈ సమయంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం సరికాదని మాయావతి స్పష్టంచేశారు. ‘ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలను కేంద్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే’నని ఆమె పేర్కొన్నారు.