దేశంలో పలు రాష్ట్రాల్లో గురువారం నుంచి అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలే వేడి గాలులు ఆపై కరెంటు కోతలతో ప్రజల కష్టాలు మరింత పెంచాయి. గురుగ్రామ్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వేడిగాలుల ప్రభావంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.దేశ రాజధాని నగరం దిల్లీలో గురువారం ఉష్ణోగ్రత 43.5 డిగ్రీలు నమోదైంది. దిల్లీలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత గత 12 సంవత్సరాలలోనే అత్యధికమని ఐఎండీ అధికారులు చెప్పారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత పెరిగింది. రాజస్థాన్, దిల్లీ, హర్యానా, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.హీట్వేవ్ ప్రభావిత ప్రాంతాల్లో శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఆరోగ్య సమస్యల బారిన పడతారని ఐఎండీ తెలిపింది.ఏప్రిల్ 28 నుంచి దేశ రాజధాని నగరమైన దిల్లీలో హీట్ వేవ్ కోసం ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు.ఉష్ణోగ్రతలు పెరగడంతో దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. గురువారం తొలిసారిగా దిల్లీలో విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్ల మార్కును దాటింది.రాజస్థాన్ కర్మాగారాలకు నాలుగు గంటల విద్యుత్ కోత విధించారు.