Friday, April 26, 2024
Friday, April 26, 2024

భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి పెద్ద ఎదురుదెబ్బ

దాదాపు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్‌ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నుంచి అదనపు పరిహారం కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీల నుంచి రూ.7,844 కోట్ల అదనపు పరిహారం చెల్లించాలని కోరుతూ క్యూరేటివ్ పిటిషన్‌ను కేంద్రం దాఖలు చేయగా.. దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో మానవ జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అయితే, పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. మోసపూరితంగా మాత్రమే సెటిల్‌మెంట్‌ను పక్కన పెట్టవచ్చని, కేంద్రం అలాంటి వాదనలు చేయలేదని పేర్కొంది. అప్పట్లో పరిహారం కింద రూ.715 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. దాదాపు 40 ఏళ్ల కిందట మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గ్యాస్ దుర్ఘటన చోటుచేసుకుని వేలాది మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. 1984 డిసెంబర్‌ 2-3 మధ్య రాత్రి వేళ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ రసాయనాల ప్లాంట్‌ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విష వాయువులు లీక్‌ అయ్యాయి.సుమారు 8 వేల మంది వరకు మరణించగా.. ఐదు లక్షలకుపైగా జనం విషవాయువునకు ప్రభావితమయ్యారు. ఎన్నో కుటుంబాలు బాధితులుగా మిగిలాయి. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అయిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సుదీర్ఘకాలంగా న్యాయం కరవైంది. ఈ దుర్ఘటన జరిగి 39 ఏళ్లు అయినప్పటికీ మరణాల సంఖ్య, బాధితుల విషయంలో ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి.

ఎంత మంది చనిపోయారు, ఎంత మంది దీని బారిన పడ్డారన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రమాద గణాంకాలపై అస్పష్టంగా ఉండటంతో భోపాల్ గ్యాస్ ఘటన బాధితుల తరఫున పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img