కొత్తగా 13,091 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ అధికమయ్యాయి. బుధవారం 11 వేల పైచిలుకు నమోదవగా, తాజాగా అవి 13 వేలు దాటాయి. నిన్నటి కంటే 14 శాతం మేర కేసులు పెరిగాయి. దేశంలో కొత్తగా 13,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరింది. ఇందులో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,38,556 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,62,189 మంది మృతిచెందారు. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి 13,878 మంది బయటపడ్డారు. ఇక కొత్త కేసుల్లో కేరళలోనే సగానికిపైగా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 7,540 కేసులు నమోదవగా, కరోనా బారినపడి 259 మంది మృతిచెందారు.