విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు అంచనాల ఆమోదంపై నాలుగు సంవత్సరాలుగా నానుస్తున్న కేంద్ర ప్రభుత్వం… రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను రీయంబర్స్ చేయడంలోనూ తిరకాసు పెడుతోంది. ప్రాజెక్టుపై కేంద్రం చేసిన వ్యయం, రాష్ట్రానికి రావల్సిన బకాయిలపై సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా ఆర్టీఐ కార్యకర్త రమేశ్ చంద్రవర్మ వివరాలు కోరడంతో ఈ విషయం బట్టబయలైంది. సాగునీటి కాంపొనెంట్ కింద ఇంకా ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెల్లించాల్సింది కేవలం రూ.1,249 కోట్లు మాత్రమేనని కేంద్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది.
2014 నుంచి 2023 వరకు రూ.13,463 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంగా రీయంబర్స్ చేసినట్లు కేంద్రం తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలి ఉన్న సాగునీటి కాంపొనెంట్కు మాత్రమే 100 శాతం నిధులు రీయంబర్స్ చేస్తామని వెల్లడిరచినట్లు కేంద్రం పేర్కొంది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ నివేదిక ప్రకారం సాగునీటి కాంపొనెంట్ వ్యయం రూ.20,398.61 కోట్లుగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు ఉంటే… కేంద్ర సాయంగా రీయంబర్స్ చేయాల్సిన మిగిలిన మొత్తం రూ.15,667.90 కోట్లుగా తెలిపింది. ఇందులో 2023 మార్చి 31వ తేదీ వరకు రీయింబర్స్ చేసిన మొత్తం రూ.14,418.39 కోట్లుగా కేంద్ర జలవనరుల శాఖ తేల్చి చెప్పింది. దీని ప్రకారం ఇంకా రూ.1,249 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కాంపోనెంట్గా రీయింబర్స్ చేయాల్సి ఉందని తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.2,600 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని చెబుతోంది.