లఖింపూర్ ఖేరి ఘటన కేసులో సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారనాడు ఆదేశించింది.శ్యామ్ సుందర్, పాత్రికేయుడు రమన్ కశ్యప్ మృతికి సంబంధించి స్థాయీ నివేదకను కూడా తమకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. లఖింపూర్ కేసులో 30 మంది నుంచి 164 స్టేట్మెంట్లు రికార్డు చేశామని, వారిలో 23 మంది ప్రత్యక సాక్షులని మంగళవారంనాడు కేసు విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, ఘటన వీడియోలకు సంబంధించిన నివేదిక ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్లు వేగవంతం చేయాలని ఆదేశించింది. ఘటన సమయంలో 4 నుంచి 5 వేల మంది స్థానికులు ఉన్నప్పుడు, ఘటన అనంతరం కూడా వీరిలో ఎక్కువ మంది ఆందోళనకు దిగినప్పుడు, వారిని గుర్తుపట్టడం పెద్ద సమస్య కాదని కోర్టు పేర్కొంది.