న్యూదిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మిఠాయి దుకాణాలకు రాజకీయ పార్టీల నేతల నుంచి లడ్డూల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో పంజాబ్ స్వీట్ షాపులు లడ్డూల ఆర్డర్లతో నిండిపోయాయి. లూథియానాలోని ఒక స్వీట్ షాప్ ఐదు కిలోల బరువున్న ‘జీత్ కే లడ్డూస్’ పేరిట సిద్ధం చేసింది. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి గుర్తుగా ఈ సంవత్సరం తమకు లడ్డూల ఆర్డర్లు పెద్దమొత్తంలో వచ్చాయి. ఈ ప్రత్యేక లడ్డూల తయారీకి తాము శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని పంజాబ్ హల్వాయి అసోసియేషన్ ప్రెసిడెంట్ నరీందర్ సింగ్ చెప్పారు. లడ్డూలు తయారు చేసి, వాటిని ట్రేలలో ప్యాక్ చేయడంలో సిబ్బంది బిజీగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎవరికి వారు తాము గెలుస్తామనే ధీమాతో స్వీట్ షాపులకు ముందుగానే లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.